పక్షవాతం నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధి.శరీరములోని వివిధ అవయవాలు ప్రయత్నపూర్వక చలనాలను కోల్పోయే రుగ్మతను ‘పక్షవాతము’ అంటారు.శరీరం బిగుసుకుపోవడం,మూతి వంకర తిరిగి పోవడం,

కాళ్లు చేతులు మెలితిరిగి పోవడం,గుండె కూడా పనిచేయకపోవడం ఇలా శరీరంలో ప్రతి అవయవంపై పక్షవాతప్రభావం ఉంటుంది.ప్రపంచంలో ప్రతి ఆరుగురిలో ఒకరికి వారి జీవిత కాలంలో పక్షవాతం వస్తోంది.ప్రతి ఆరు సెకెండ్లకు ఒకరు పక్షవాతంతో మృతి చెందుతున్నారు.

మన దేశంలోనూ ఈవ్యాధి వల్ల రోజుకు రెండు వేల మంది చనిపోతున్నారు.కేవలం 10 శాతం మందికే పక్షవాతంపై అవగాహన ఉంది. దీని వల్ల సగానికి పైగా తమ పని కూడా చేసుకోలేనంతగా అంగవైకల్యానికి గురవుతున్నారు.పక్షవాతంపై ప్రజల్లో అవగాహన పెంచడానికి ప్రపంచవ్యాప్తంగా అక్టోబరు 29న వరల్డ్‌ స్ట్రోక్‌ డేను నిర్వహిస్తున్నారు.గతంలో ఈవ్యాధి వృద్ధుల్లోనే కనిపించేది.

ప్రస్తుతం పక్షవాతం కేసుల్లో 25 నుంచి 30 శాతం వరకు చిన్నవయసు వారుంటున్నారు. అధిక రక్తపోటు, మధుమేహ వ్యాధి, ధూమపానం, మద్యపానం, అధిక కొలెస్ట్రాల్‌, గుండె జబ్బులు, ఊబకాయం ఉన్నవారికి పక్షవాతం రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. కళ్ళు తిరగటం, తాత్కాలికంగా దృష్టి మందగించడం, లేదా రెండుగా కనిపించడం,

కాళ్ళూ, చేతులు ఉన్నట్లుండి బలహీనంగా అవడం, మాటల్లో తడబాటు వంటివన్నీ పక్షవాతానికి ముందస్తు సంకేతాలు. ఈలక్షణాలు కనిపించిన వెంటనే కనీసం గంటలోపు స్ట్రోక్‌ యూనిట్‌ సౌకర్యం ఉన్న వైద్యశాలకు తీసుకురాగలిగితే వారికి త్రాంబోలైటిక్‌ థెరపీ ద్వారా రక్తప్రసరణ పునరుద్ధరించి, మెదడు ఎక్కువగా దెబ్బతినకుండా కాపాడవచ్చు. అయితే దురదృష్టవశాత్తు ఈ వ్యాధిపై అవగాహన లేకపోవడం వల్ల 10 శాతం మంది కూడా గంటలోపు ఆసుపత్రికి రావడం లేదు.